ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ముచికుందునకు వరము ప్రసాదించుట
“రాజువై యుండియు రాజధర్మములు
యోజఁదప్పక యుండియును మృగహింస
మాని చిత్తమునఁ జిన్మయుడఁగు నన్నుఁ
బూని నిల్పితిగానఁ బొలిసెఁ బాపములు
భావిజన్మమున విప్రత్వంబుఁ దాల్చి
సేవకోత్తమ నన్నుఁ జెందెద” వనుచు
ముచికుందు బోధింప మొగి నమ్మహీశుఁ
డచలితంబగుభక్తి నందంద మ్రొక్కి
హరికిఁ బ్రదక్షిణమై వచ్చి నృపతి
గురుతరంబగు శైలకుహరంబు వెడలి
యతిసూక్ష్మతరదేహులగు మనుష్యులను
నతిసూక్ష్మతరువుల నందంద చూచి
కలియుగంబున వెళ్ళగా నోప ననుచుఁ
దలఁచుచు గంధమాదనముల కరిగె
బదరికావనభూమిఁ బద్మాక్షునాత్మ
వదలక ఘనతపోవరనిష్ఠనుండె.
హరి కాలయవనుని యడఁచి యమ్మధుర
కరిగి తత్సేనల నవనిపైఁ గూల్చి
వాని ఘోటకమణి వారణావళుల
మానైన హాటకమణి కదంబముల
ద్వారావతికిఁ బుచ్చి తాను సీరియును
నారూఢజయకాములై యుండిరంత.